సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చాగంటి పరమేశ్వర రెడ్డి
గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : జీవితానుభవాల సారాన్ని భావితరాలకు అందించడంలో సీనియర్ సిటిజెన్లు సమాజానికి మార్గదర్శకులుగా ఉంటున్నారని రాష్ట్ర సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు చాగంటి పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ప్రజా ఆలోచన వేదిక ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బ్రాడీపేట కార్యాలయంలో ఇటీవల మరణానంతరం నేత్రదానం చేసిన కస్తూరి లక్ష్మి రంగ, బందా ఆదిత్య ల కుటుంబ సభ్యులు కేఆర్ కే శర్మ బందా శశిధర్ లను శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు. ప్రజా ఆలోచనా వేదిక కన్వీనర్ వల్లూరి సదాశివరావు మాట్లాడుతూ భారతదేశంలో రక్తదానం, నేత్రదానం, అవయవ, దేహదానంల పై ప్రజలను జాగ్రత్త పరచవలసిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు సీనియర్ సిటిజనులపైనే ఎక్కువగా ఉన్నదని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు యు వి వి రత్నసాగర్ మాట్లాడుతూ సమాజ హిత కార్యక్రమాల అమలులో తమ అసోసియేషన్ నిరంతరం పాలుపంచుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షులు మేడూరి రాజేంద్రప్రసాద్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏఎంజి ఉమామహేశ్వరరావు జిల్లా కార్యదర్శి ఏల్చూరి రాంబాబు, కోశాధికారి కోటంరాజు కామేశ్వరరావు, మహిళా కన్వీనర్ సుబ్బాయమ్మ, మధుసూధన రావు, తదితరులు పాల్గొన్నారు.


