హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ అవగాహన కార్యక్రమం
గుంటూరు, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు 200 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వేగం కంటే ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నగరంపాలెం సీఐ ఎం. రాజేష్, వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య, నగరంపాలెం ఎస్ఐ రాంబాబు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ పుల్లా సుందరంబాబు, గుంటూరు జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మద్ది రామకృష్ణ, గ్రంధి అనిల్కుమార్, వీఎన్ఆర్ టీం, గుంటూరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీంలను నిర్వాహకులు అభినందించారు. టీం తారక్ ట్రస్ట్ ఫౌండర్ మనోజ్ యార్లగడ్డ, కో-ఫౌండర్లు వంశీకృష్ణ కాగిత, కార్తీక్ యార్లగడ్డ, సభ్యులు శ్యాం యార్లగడ్డ, అవినాష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. హరికృష్ణ సేవా స్ఫూర్తితో ప్రజల ప్రాణ భద్రత కోసం మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపడతామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.


