కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలు : వైఎస్ఆర్సిపి నేతలు
వైసీపీ నాయకులు భక్తులకు, ఆలయానికి క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు మరియు స్థానికులు డిమాండ్

గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లాలోని పెదకాకాని శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద వైఎస్సార్సీపీ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల ఆలయంలో అమ్మవారి నాన్రాడు (మంగళసూత్రం) మాయమైన నేపథ్యంలో, వైసీపీ నాయకులు కొత్త నాన్రాడును సమర్పించడానికి ఆలయానికి తరలివచ్చారు. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు పెదకాకాని ఆలయ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయ ప్రతిష్టను మంటగలుపుతున్నారని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు భక్తులకు, ఆలయానికి క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు మరియు స్థానికులు డిమాండ్ చేశారు. ఆలయానికి వస్తున్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాడి విష్ణు వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య నెట్టివేతలు, వాగ్వాదం జరిగాయి. పోలీసులు ఇప్పటికే ఈ దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారని, అయితే వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఆ నిందితుడు నిర్దోషి అంటూ ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా రాజకీయం చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. ప్రభుత్వం, దేవాదాయ శాఖ వైఫల్యం వల్లే ఆలయంలో దొంగతనం జరిగిందని, తాము భక్తుల కానుకలతో చేయించిన రూ. 18 లక్షల విలువైన నాన్రాడును సమర్పించడానికి వస్తే కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ నాయకులు ఆలయం నుండి వెళ్లిన తర్వాత, ఆలయ పరిసరాలను పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపై కూడా ఇరు పార్టీల మధ్య తీవ్రమైన రాజకీయ విమర్శలు నడుస్తున్నాయి.


