సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్ శనివారం మీడియాకు వెల్లడించారు. గుంటూరు పరిధిలోని జగనన్న కాలనీల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని చెప్పారు. తక్షణమే స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. టిడ్కో గుహాల లబ్దిదారులకు ఈఎంఐ లను రద్దు చేయాలని కోరారు. టిడ్కో గుహాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. అదేవిధంగా సొంత ఇళ్లు లేని పేదలకు 2 సెంట్లు చొప్పున ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలన్నారు. పేదల ఇళ్ల స్థలాలు, ఇళ్ళ నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం 7వ తేదీన తలపెట్టిన ధర్నాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆందోళనకు సంబంధించిన పోస్టర్లను సీపీఎం నేతలు, శ్రీనివాసరావు, ఖాసింతో కలిసి విడుదల చేశారు.


