గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని శని,ఆదివారాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లోను ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు (బి.ఎల్.ఓ) ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని అన్నారు. ముసాయిదా ఓటరు జాబితా బి.ఎల్.ఓల వద్ద లభ్యంగా ఉందని, ఓటర్లు తమ ఓటు వివరాలను ముసాయిదా ఓటరు జాబితాలో పరిశీలించుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకొనుటకు, వివరాల్లో మార్పులు, చేర్పులు, సవరణలు చేయుటకు సంబంధిత పోలింగ్ కేంద్రంలో బిఎల్ఓలను సంప్రదించి ఫారం 6, 7 లేదా 8 అందించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటును పదిలపరచుకోవాలని కోరారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి వచ్చే వారికి స్పష్టమైన సమాచారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


