పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలోకాలువలో పడిన కారు..
నలుగురి గల్లంతు..
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇరగవరం మండలం ఆయిలంపూడి లాకుల వద్ద నియంత్రణ కోల్పోయిన ఓ కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు గల్లంతు కాగా, మరో వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఓగిడి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పెరవలిలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరై, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిలంపూడి లాకుల సమీపంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి వేగంగా కాలువలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో ఒక యువకుడు వెంటనే కారులో నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోగా, మిగిలిన నలుగురు కారుతో పాటు నీటిలో మునిగిపోయారు. గల్లంతైన వారిని పోతుల లక్ష్మీ భాను (18), రాజారామ్ (17), నాగిరెడ్డి దుశ్వంత్ (18), సాయి సూర్య (19)గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


