ఎస్పీకి మెమోరాండం అందజేసిన గుంటూరు జిల్లా బీజేపీ నాయకులు
గుంటూరు, 25 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు గుంటూరు జిల్లా ఎస్పీకి మెమోరాండం మంగళవారం సమర్పించారు. ఏఈ నూకరాజు కుటుంబానికి సంబంధించిన ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు, ఆందోళన వ్యక్తమవుతున్నాయని, సాదిక్ ఖాన్పై వచ్చిన ఆరోపణలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని బీజేపీ డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా, ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా విచారించాలని కోరింది. ఈ ఘటనకు సంబంధించి మోసం, బెదిరింపులు, ఆర్థిక దోపిడీ, బ్లాక్మెయిల్ వంటి తీవ్ర ఆరోపణలు మెమోరాండంలో ఉన్నాయని, వాటిపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపి, ఆరోపణలు రుజువైతే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కోరింది. ఈ ఘటనలో సంబంధం ఉన్నట్లు తేలే ఇతర వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న ఇలాంటి కేసులపై సమీక్ష చేయాలి ఈ సందర్భంగా లవ్ జిహాద్ పేరుతో నమోదవుతున్నట్లు ఆరోపణలు ఎదురవుతున్న కేసులపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని తిరుపతిరావు అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి కేసులపై ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని కేసులు ఎఫ్ ఐ ఆర్ లుగా నమోదు అయ్యాయి, ఎలాంటి దర్యాప్తు జరిగింది, ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశాలపై ప్రభుత్వం మరియు పోలీసు శాఖ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పుడు వారి ఫిర్యాదులను సీరియస్గా పరిగణించి, చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
డీజీపీ, హోంమంత్రి స్పందించాలి : ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ మరియు రాష్ట్ర హోంమంత్రి వెంటనే స్పందించి, సంబంధిత కేసుపై జరుగుతున్న దర్యాప్తు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కేసులపై పోలీసు శాఖ చేపడుతున్న చర్యలపై సమగ్ర వివరాలు వెల్లడించాలని తిరుపతిరావు డిమాండ్ చేశారు. “బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి” అని తిరుపతిరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై సుబ్బారావు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బజరంగ్ రామకృష్ణ, కార్యదర్శులు కే నారాయణ రెడ్డి, సురేష్ జైన్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు షేక్ సాంబశివరావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ధార అంబేద్కర్, ఎస్ టి మోర్చా జిల్లా అధ్యక్షులు నాయక్, ఎస్సీ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.


