యశోద హాస్పిటల్స్ లో రోబోటిక్ సర్జరీలతో మెరుగైన క్యాన్సర్ చికిత్సలు
ఎంఆర్ లినక్ (MR Linac) సాంకేతికతతో అత్యంత కచ్చితమైన రేడియేషన్
ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి నూరు శాతం విముక్తి
మారుతున్న జీవనశైలి, చెడు వ్యసనాలతోనే పొంచి ఉన్న గ్యాస్ట్రో ముప్పు
- గుంటూరు విలేకరుల సమావేశంలో ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ శ్రీపతి వెల్లడి
గుంటూరు, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మారుతున్న జీవనశైలి, ఆధునిక ఆహారపు అలవాట్లు మానవ శరీరంలోని అత్యంత కీలకమైన జీర్ణకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ట్రో సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ల బారి నుంచి రోగులను కాపాడేందుకు ఆధునిక వైద్య సాంకేతికత సంజీవనిలా మారుతోందని యశోద హాస్పిటల్స్ ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్ శ్రీపతి స్పష్టం చేశారు. సోమవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జీర్ణకోశ వ్యాధులపై సమగ్ర సమాచారాన్ని పంచుకున్నారు. అత్యంత సంక్లిష్టమైన గ్యాస్ట్రో శస్త్రచికిత్సలను అలవోకగా ఛేదించి వేలాది మంది రోగులకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్ వెంకటేష్ శ్రీపతి, తన అపార అనుభవంతో జాతీయ స్థాయిలో అగ్రగామి సర్జన్గా విశేష గుర్తింపు పొందారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగికైనా అత్యాధునిక పద్ధతుల్లో చికిత్స అందించి ప్రాణాలు నిలపడంలో ఆయనది అందెవేసిన చేయి.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన వేళకు ఆహారం తీసుకోకపోవడం, ధూమపానం, మద్యపానం, ఊబకాయం, మధుమేహం తదితర కారణాల వల్ల కాలేయం, ప్యాంక్రియాస్, అన్నవాహిక, జీర్ణాశయం, పెద్దపేగు తదితర అవయవాలు తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నాయని డాక్టర్ వెంకటేష్ శ్రీపతి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కడుపులో నొప్పి, ఆహారం మింగేటప్పుడు ఇబ్బందిగా అనిపించడం, ఆకలి మందగించడం, అకారణంగా బరువు తగ్గడం, మలంలో రక్తం పడటం వంటి లక్షణాలను సాధారణ సమస్యలుగా భావించి ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. ఈ తరహా లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా పెను ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు.
క్లిష్టమైన గ్యాస్ట్రో సమస్యలు, క్యాన్సర్లకు యశోద హాస్పిటల్స్ వేదికగా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, ఈఆర్సీపీ, లాపరోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సల ద్వారా అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నట్లు డాక్టర్ వెంకటేష్ వెల్లడించారు. ముఖ్యంగా గ్యాస్ట్రో క్యాన్సర్ల చికిత్సలో మాగ్నెటిక్ రెసోనెన్స్ లీనియర్ యాక్సిలరేటర్ (ఎంఆర్ లినక్) సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని వివరించారు. ఈ అత్యాధునిక విధానంలో ప్రతిరోజూ ఎంఆర్ఐ చిత్రాల ఆధారంగా కాలేయం, ప్యాంక్రియాస్, అన్నవాహిక, రెక్టమ్ ప్రాంతాల్లోని క్యాన్సర్ కణితులను కచ్చితత్వంతో గుర్తించి రేడియేషన్ అందిస్తారని, దీనివల్ల చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేశారు. దుష్ప్రభావాలు లేని ఈ విధానం ద్వారా క్యాన్సర్ చికిత్సలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, 24 గంటల అత్యవసర సేవలు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగాలతో పాటు సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజీ నిపుణుల సమన్వయంతో ఒకే గొడుగు కింద రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, పునరావాసం వరకు సమగ్ర వైద్య సేవలు అందించడం యశోద హాస్పిటల్స్ సొంతమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ హెడ్ వీరంకి వెంకటేశ్వరరావు, గుంటూరు ఏరియా అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ తిమోతి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు డాక్టర్ వెంకటేష్ ఓపికగా సమాధానాలు ఇచ్చారు.


