Thursday, September 10, 2026
spot_imgspot_img

జర్నలిజంలో ఆరు నెలల డిప్లొమా కోర్సు

Must read

📰 Generate e-Paper Clip

గుంటూరు, 06 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అతి తక్కువ ఫీజు తో “జర్నలిజంలో డిప్లొమా కోర్సు” చేసే మంచి అవకాశాన్ని సి.ఆర్. మీడియా అకాడమీ అందిస్తోందని ఛైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కోర్సు ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్టులకోసం ఉద్దేశించినదైనా, జర్నలిజం వృత్తిలో అభిరుచి కలిగిన డిగ్రీ ఉత్తీర్ణులైన సాధారణ అభ్యర్థులు కూడా ఈ డిప్లమా కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే లక్ష్యాలకు అనుగుణంగా ఈ కోర్సును రూపొందించామన్నారు. జర్నలిస్టులకు వృత్తిపరమైన విద్యార్హత ఉంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్, ప్రస్తుత ఒంగోలు ఆంద్ర కేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. డి.వి.ఆర్.మూర్తి ఆధ్వర్యంలోని వివిధ యూనివర్సిటీల జర్నలిజం డిపార్టుమెంట్ ప్రొఫెసర్ లతో కూడిన “బోర్డు ఆఫ్ స్టడీస్” ఈ డిప్లొమా కోర్సును రూపొందించిందని చెప్పారు. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ల న్యూస్ చానెళ్లకు, పత్రికలకు ఉన్నత ప్రమాణాలతో పనిచేయ గలిగిన సామర్ధ్యం ఈ కోర్సును చేయడం ద్వారా అభ్యర్థులు పొందగలరన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్ విభాగం రిటైర్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు ప్రొఫెసర్ పి. బాబీ వర్ధన్ “కోర్సు డైరెక్టర్ గా వ్యవహరిస్తారన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్స్ విభాగం హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటు ప్రొ. కె. జోతిర్మయి యూనివర్సిటీ తరపున కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారన్నారు. కోర్సు కాల వ్యవధి 6 నెలలని తెలిపారు. ఎంపిక చేసిన రిటైర్డ్ అధ్యాపకులు, సీనియర్ జర్నలిస్టులు క్లాసులు నిర్వహిస్తారన్నారు. ప్రతి రోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, 9 నుంచి 10 గంటల వరకు రెండు క్లాసులు జరుగుతాయన్నారు. ఆన్ లైన్ (కరెస్పాండెన్సు) విధానంలో క్లాసులు నిర్వహిస్తామన్నారు. కోర్సు పూర్తి అవుతున్న సమయంలో ప్రతి అభ్యర్థి కోర్సు డైరక్టర్ ఆధ్వర్యంలో అస్సైన్ మెంట్స్ రాయాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కులకు అస్సైన్మెంట్ మార్కులు కలిపి తుది ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెల్లడిస్తుందన్నారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నాగార్జున యూనివర్సిటీ డిప్లొమా సర్టిఫికెట్ జారీ చేస్తుందన్నారు. ఇందుకోసం మీడియా అకాడమీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు.
వర్కింగ్ జర్నలిస్టులు డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తులో తమ వివరాలు నింపి ఇంటర్ మీడియట్ సర్టిఫికెట్, అక్రిడిటేషన్ కార్డు లేదా ఐ.డి.కార్డు లేదా సర్వీసు ధ్రువీకరణ పత్రం జెరాక్స్ కాపీ లను సెక్రెటరీ, సి.ఆర్. మీడియా అకాడమీ పేరున తీసిన రూ..2000/- డిమాండ్ డ్రాఫ్ట్ ను జతపరచి దరఖాస్తును సమర్పించాలని సూచించారు. జర్నలిజం పై అభిరుచి కలిగిన ఇతర అభ్యర్థులు దరఖాస్తుతో డిగ్రీ సర్టిఫికేట్, సెక్రెటరీ సి.ఆర్.మీడియా అకాడమీ పేరున తీసిన రూ..2500/- డిమాండ్ డ్రాఫ్ట్ ను జతపరచి పంపుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు https://drive.google.com/file/d/1ajW2Oaw5pKw-E9zCG1IVRDMNTsmO_tBK/view?usp=sharing లింక్ ను క్లిక్ చేసి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలు కూడా ఈ లింక్ లో పొందుపరచామన్నారు. దరఖాస్తులను సెక్రెటరీ, ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్. మీడియా అకాడమీ, 40-6/4-8, 4 వ అంతస్తు, రెవెన్యూ కాలనీ, మొగల్రాజపురం, విజయవాడ. 520010 చిరునామాకు ఆగస్టు 20వ తేదీ లోగా పంపాలని సూచించారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి క్లాసులు ప్రారంభ మౌతాయన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article

App Icon

Install Bharath Prathinidhi News App

Add to home screen for faster loading and latest updates.