చెక్కును ఆలయ ఈవో వై నరేష్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ వేదాంతం శ్రీనివాస శర్మకు అందజేసిన ఎమ్మెల్యే నసీర్
గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. గురువారం స్థానిక రైలుపేటలోని శ్రీ అంజనేయస్వామి దేవస్థానం పునరుద్ధరణ నిమిత్తం దాతలు అందజేసిన రూ.25 లక్షల చెక్కును ఆలయ ఈవో వై నరేష్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ వేదాంతం శ్రీనివాస శర్మకు ఎమ్మెల్యే నసీర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ప్రతి ఆలయానికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని, కొన్ని పునర్నిస్తున్నామని చెప్పారు. ఆలయాల అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల సమగ్ర అభివృద్ధి, ధార్మిక పరిరక్షణ, భక్తులకు మౌలిక వసతుల కల్పన దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 360కి పైగా ఆలయాల పునర్నిర్మాణం, ధూపదీప నైవేద్యాలు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం రూ.500 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు.


