అనకాపల్లి జిల్లా బ్యూరో, 14 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామంలో భూముల బదలాయింపు ప్రక్రియకు సంబంధించి రైతుల అంగీకారం లేకుండా ఎలాంటి తీర్మానాలు చేయవద్దని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు గ్రామస్తులు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నక్కపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం నుంచి లెటర్ నం. 221/2026, తేదీ 26-07-2026తో జారీ చేసిన నోటీసును కాగిత గ్రామ సచివాలయంలో 10-08-2026న ప్రదర్శించినట్లు గ్రామస్తులు తెలిపారు.

నోటీసులో పేర్కొన్న భూములకు సంబంధించిన బదలాయింపు ప్రక్రియపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులకు సంబంధించిన భూముల విషయంలో వారి అంగీకారం లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, గ్రామసభ నిర్వహించి రైతులు మరియు గ్రామస్తుల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని వారు కోరారు. అలాగే ఈ అంశంపై గ్రామపంచాయతీ నుంచి తమకు తెలియకుండా ఎలాంటి తీర్మానాన్ని సంబంధిత ఉన్నతాధికారులకు పంపించవద్దని విజ్ఞప్తి చేశారు. తమ భూములు, వ్యవసాయానికి సంబంధించిన నీటి వనరులు మరియు ఇతర అంశాలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, గ్రామస్తులు పాల్గొని తమ అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.


