రేపల్లె, 29 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ప్రభుత్వం స్పెషల్ టెట్ స్థానంలో సాధారణ టెట్ నిర్వహణకు సిద్ధం కావడాన్ని నిరసిస్తూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF) ఆధ్వర్యంలో రేపల్లెలో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ తాలూకా, రింగ్ రోడ్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శాంతారావు మాట్లాడుతూ.. స్పెషల్ టెట్లో అర్హత మార్కులు తగ్గించాలని, ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులకే పరీక్ష నిర్వహించాలని, ఆఫ్లైన్ పద్ధతిలోనే పరీక్ష జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. సీఐటీయూ మరియు ప్రజా సంఘాల మద్దతుతో జరిగిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు ఎంబి సుబ్రహ్మణ్యం, రేపల్లె మండల అధ్యక్షులు జి. సుబ్రహ్మణ్యం, సీఐటీయూ జిల్లా కోశాధికారి సీహెచ్. మణిలాల్, కార్యదర్శి వి. సుబ్బారావు, నాయకులు చుక్కా కోటేశ్వరరావు, కే. రాంబాబు, గణపయ్య, రవీంద్ర, రాజు భూషణం తదితరులు పాల్గొన్నారు.


