గుంటూరు, 26 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్ల కాలంలోనే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, స్థానిక సంస్థల్లో కూటమిని బలపరిస్తే మరింత ప్రగతి సాధించే అవకాశం ఉంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో 8:30 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తొలుత డొంక రోడ్డు నుంచి శ్రీనగర్ ఏడో లైన్ వరకు బైకులు, కార్లతో కూటమి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీనగర్ లో రూ.7 కోట్లు, వసంతరాయపురంలో రూ.1.50 కోట్లతో సిసి రోడ్లు డ్రైన్లు పైపులైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ,గత వైసీపీ పాలనలో కార్పొరేషన్ నిధులను దోచుకుతింటే, తమ ప్రభుత్వంలో ప్రతి రూపాయిని ప్రజలకు జవాబుదారీగా పని చేస్తున్నామని తెలిపారు. కేవలం రెండేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించామని, స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయి మెజారిటీ అందిస్తే రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత మేలు చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కూటమి ప్రభుత్వానికి మద్దతు అందించాలని కోరారు. కార్పొరేషన్ లో కూటమికి తగినంత బలం చేకూరిస్తే గుంటూరు నగరానికి మహర్దశ వస్తుందన్నారు.. ఇప్పటికే అంతర్గత రోడ్లు, డ్రైన్, వాటర్ పైపులైన్లు నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. నగరంలోని మురుగునీరు బయటకు పోయేందుకు డ్రెన్ల నిర్మాణం చేపట్టామన్నారు. 28 కిలోమీటర్ల మేర నూతన రోడ్లు నిర్మించామని తెలిపారు. నందివెలుగు రోడ్డు, కాకాని రోడ్డు, ఏటుకూరు రోడ్డు, సిఆర్ నగర్ వంటి ప్రాంతాల్లో డ్రెయిన్లు అనుసంధానం చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో రూ.200 కోట్ల నిధులు నగరాభివృద్ధికి రానున్నాయని, దీంతో గుంటూరు రూపురేఖలు మార్చబోతున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలియజేసారు.


