గుంటూరు, 22 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రముఖ సినీ నటుడు, పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అభిమానులు, పార్టీ నాయకులు, ప్రజల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సాధారణ కుటుంబం నుంచి సినీ రంగంలో అడుగుపెట్టి తన కృషి, పట్టుదల, అంకితభావంతో దేశంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకునే స్థాయికి ఎదిగిన చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ఒక కుటుంబంలో పెద్ద కుమారుడు ఎలా బాధ్యతాయుతంగా ఉండాలో, జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఎలా ఉండాలో చిరంజీవి జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. కింద స్థాయి నుంచి పైకి వచ్చిన ఆయన ప్రయాణం నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. సినీ నటుడిగా మాత్రమే కాకుండా సమాజ సేవకుడిగా కూడా చిరంజీవి విశిష్టమైన సేవలు అందించారని ఆమె కొనియాడారు. రక్తదాన ఉద్యమం, నేత్రదాన కార్యక్రమాల ద్వారా వేలాది మందికి స్ఫూర్తినిచ్చారని, సమాజానికి ఉపయోగపడాలనే తపన ఆయన వ్యక్తిత్వాన్ని మరింత గొప్పదిగా నిలబెట్టిందని అన్నారు. నటనలో, నాయకత్వంలో, వ్యక్తిత్వ వికాసంలో రానున్న తరాలకు చిరంజీవి మార్గదర్శకుడిగా నిలుస్తారని ఎమ్మెల్యే మాధవి పేర్కొన్నారు.


