విజయవాడ, 17 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విశ్రాంత సెంట్రల్ ఎక్స్సైజ్, కస్టమ్స్, జీఎస్టి అసిస్టెంట్ కమిషనర్ మేడిద నాగరాజు, తన ఉన్నతికి సోపానంగా నిలిచిన పాఠశాల అభివృద్ధికి అండగా నిలిచారు. సోమవారం విజయవాడ భవానిపురం లోని సీ.ఎస్.ఐ ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేవిధంగా టెలివిజన్ ను నాగరాజు బహుమతిగా అందచేసారు. ఇదే పాఠశాల ఆవరణలో నాగరాజు నిర్మిస్తున్న ఒక షెడ్డు నిర్మాణానికి ఆయన ప్రారంభోత్సవం చేసారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, నిఘంటువులను బహుకరించారు. తదంతరం విద్యార్థులకు అన్నదానం చేసారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ సమాజంలో తనకు ఒక మంచి స్థానాన్ని కల్పించిన ఈ పాఠశాల అభివృద్ధికి జీవితాంతం చేయూతనిస్తానన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకోవడం సామాజిక బాధ్యత గా భావించి, విశ్రాంత ఉద్యోగులు తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీనా కుమారి మాట్లాడుతూ.. పాఠశాలకు సంబంధించిన ప్రతి అవసరాన్ని దశల వారీగా నాగరాజు సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. పూర్వ విద్యార్థి నాగరాజు చేస్తున్న కృషిని, పూర్వ విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకొని, పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సెంట్రల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ బి. రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు.


