గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (డిఎంఎసి) చైర్మన్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రెండో సబ్ కమిటీ సమావేశం గురువారం విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధుల అక్రిడిటేషన్ దరఖాస్తులను సబ్ కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తులను ఆమోదిస్తూ, అర్హులైన ప్రతి మీడియా ప్రతినిధికి మీడియా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు పారదర్శకంగా, నిష్పాక్షికంగా అక్రిడిటేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు. మీడియా ప్రతినిధుల సంక్షేమం, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సక్రమంగా అందేలా డిఎంఎసి కమిటీ కట్టుబడి పనిచేస్తుంది. ఈ సమావేశంలో డిఎంఎసి సబ్ కమిటీ సభ్యులు, సమాచార & పౌర సంబంధాల శాఖ (ఐ & పి ఆర్) అధికారులు తదితరులు పాల్గొన్నారు.


