సీ.బీ.ఐ.సీ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపి అధ్యక్షుడు టి. వివేకానంద
గుంటూరు, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల హక్కులను కాలరాసే చర్యలు చేపట్టిందని, దానిని వెంటనే విరమించుకోవాలని సెంట్రల్ బోర్డు అఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ అండ్ కస్టమ్స్ (సీ.బీ.ఐ.సీ) పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు టి. వివేకానంద డిమాండ్ చేసారు. ఆదివారం గుంటూరు కన్నవారితోటలోని జీఎస్టీ భవన్ లో ఎనిమిదవ వేతన సంఘం సమస్యలపై ఏపి లోని పలు ప్రాంతాల పెన్షనర్ల సంఘం ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు టి. వివేకానంద మాట్లాడుతూ పెన్షనర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం పెన్షన్ చట్టం మూలాలకు సవరణలు తెస్తుందని, పెన్షనర్ల మధ్య పాత, కొత్త విభేదాలు సృష్టిస్తుందన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు బి. రాజేశ్వరరావు మాట్లాడుతూ..ఎనిమిదవ వేతన కమిషన్ పెన్షనర్ల కు మేలు జరిగేలా ఉండాలన్నారు. లోపాలన్ని సవరించాలన్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసిన అదనపు పెన్షన్ ను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలన్నారు.
సంఘం జాయింట్ సెక్రటరీ పి. వి. సత్యనారాయణ మాట్లాడుతూ ఎనిమిదవ వేతన కమిషన్ ఆలస్యం నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఐ. ఆర్ ను విడుదల చేయాలని, యాభై శాతం డి. ఎ ను బేసిక్ పెన్షన్ లో విలీనం చేయాలని డిమాండ్ చేసారు. డిమాండ్ల ను ప్రభుత్వం అమలు చేయని పక్షంలో పోరాటానికి సిద్ధమవ్వాలని సమావేశం తీర్మానించింది ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం ప్రతినిధులు గుమ్మడి సీతారామయ్యచౌదరి, పి. కోటేశ్వరరావు, ఎన్. ఎస్. నగేష్ బాబు, కె. సాంబ్రాజ్యం, డి. మధు బాబు, షేక్ మస్తాన్, బి.ఎల్. ఆదినారాయణ, ఎన్. ప్రకాష్ బాబు, పూర్ణచంద్రరావు, ఆషా, ఈశ్వరమ్మ, నాగశంకర్, నంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.


