అమరావతి, 11 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్ మండపాలకు ఈ ఏడాది కూడా 9 రోజుల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటించారు. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉచిత తాత్కాలిక విద్యుత్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి ఓ ప్రకటన విడుదల చేశారు. అధీకృత గణేశ్ మండపాలకే ఉచిత విద్యుత్ వర్తిస్తుందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నట్లు వివరించారు. అవసరమైన దరఖాస్తులు విద్యుత్ అధికారులకు సమర్పించాలని సూచించారు. విద్యుత్ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి ఆదేశించారు. కనెక్షన్లు, వైరింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.


