విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం
అంతర్జాతీయం, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇండోనేషియా లోని అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్దలైంది. దాని నుంచి దాదాపు 50 వేల అడుగుల ఎత్తుకు మందపాటి బూడిద ఎగసిపడి సమీప గ్రామాలను కప్పివేసింది. ఈ అగ్నిపర్వతం శుక్రవారం నుంచి క్రియాశీలంగా ఉన్నట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ అధికారులు పేర్కొన్నారు. దాంతో వెంటనే స్థానిక గ్రామాలను ఖాళీ చేయించామని, పర్వతారోహకులకు, సందర్శకులకు అనుమతి నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదని చెప్పారు. పర్వతం నుంచి బూడిద భారీగా ఎగసిపడుతుండడంతో సుకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని సర్వీసులను రద్దు చేసినట్లు ఇండోనేషియా పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వెల్లడించారు. అగ్నిపర్వతం బద్ధలు కావడంతో 209 విమాన సర్వీసుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 22,800 మంది ప్రయాణికులపై ప్రభావం పడింది.


