గుంటూరు, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : టిక్కెట్టు లేని, అక్రమ ప్రయాణాలను అరికట్టేందుకు గుంటూరు డివిజన్లో ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే నిర్వహించింది. గుంటూరు అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ నేతృత్వంలో కమర్షియల్, టిక్కెట్ తనిఖీ సిబ్బంది స్టేషన్లు, రైళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రైల్వే చట్టం, 1989లోని సెక్షన్లు 137, 138తో పాటు జన విశ్వాస్ చట్టంలోని నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. సరైన టిక్కెట్టు లేదా ప్రయాణ అధికారం లేకుండా ప్రయాణిస్తే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. గుంటూరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఈ తనిఖీలను పర్యవేక్షిస్తూ, టిక్కెట్ తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పిఎఫ్) భద్రతా సహకారం అందించింది. ప్రయాణికులు ప్రయాణానికి ముందే చెల్లుబాటు అయ్యే టిక్కెట్లు కొనుగోలు చేసి, తనిఖీల సమయంలో రైల్వే సిబ్బందికి సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.