BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 3:17 pm Posted by : Raghunath Rolla

ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ రికార్డు

83,638 గృహాల సందర్శనతో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన పార్టీ శ్రేణులు : ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో విజయవంతం చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభినందించారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల గ్రీవెన్స్ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మొత్తం 83,638 గృహాలను సుమారు 90 శాతం మేర సందర్శించి, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు, వారి సమస్యలు, సూచనలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా పార్టీ శ్రేణులు రికార్డు స్థాయి పనితీరును కనబరిచాయని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం ప్రజా ప్రభుత్వ లక్షణమని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లడానికి కూడా వెనుకంజ వేసేవారని, ప్రజలకు అందుబాటులో ఉండకుండా వ్యవహరించారని విమర్శించారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తుంటే వారు ఆప్యాయంగా స్వాగతిస్తున్నారని చెప్పారు. ప్రజలకు చేరువగా ఉండే ప్రజా ప్రభుత్వానికి, ప్రజలకు దూరంగా ఉండే నియంతృత్వ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనని వైసీపీ నేతలు గమనించాలన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపారు. జగన్ రెడ్డి ఇతరులు చేసిన పనులకు క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు చేయడం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జగన్ రెడ్డి క్రెడిట్ చోరీ రాజకీయాలకు పాల్పడుతున్న తీరును చూసి ఆ పార్టీ నాయకులే నవ్వుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీర్వాదాలతో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.