BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 9:32 am Posted by : Raghunath Rolla

భక్తులకు నిస్వార్థ వైద్య సేవలందించేందుకు ముందుకు రండి

అమెరికాలోని వైద్యులకు టీటీడీ బోర్డు సభ్యుడు సదాశివరావు పిలుపు

అమరావతి/గుంటూరు, 07 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వైద్య కళాశాలలైన సిద్ధార్థ మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సెప్టెంబర్ 6న అమెరికాలోని అట్లాంటా నగరంలో ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనంలో ఆయా కళాశాలల పూర్వ విద్యార్థులు, పలువురు సూపర్ స్పెషాలిటీ వైద్యులు సహా వెయ్యికి పైగా మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ నన్నపనేని సదాశివరావు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘శ్రీవారి వైద్య సేవ’ కార్యక్రమంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్, బర్డ్, అశ్విని హాస్పిటల్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి, ఎస్వీ గోసంరక్షణ శాల తదితర వైద్య సంస్థల్లో భక్తులకు నిస్వార్థంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని ఆయన వైద్యులకు విజ్ఞప్తి చేశారు. శ్రీవారి వైద్య సేవ కార్యక్రమంపై వైద్యుల నుంచి చక్కటి స్పందన లభించిందని శ్రీ సదాశివరావు తెలిపారు. తాము స్వదేశానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా శ్రీవారి వైద్య సేవలో పాల్గొని భక్తులకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు వైద్యులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు భక్తులకు స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించేందుకు టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని జూన్ 5న ట్రయల్ రన్‌గా ప్రారంభించారు. ఇప్పటికే పలువురు వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వైద్య సేవలు అందిస్తున్నారు. దేశ, విదేశాల్లోని ప్రముఖ వైద్యులను శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములను చేయడం ద్వారా భక్తులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు టీటీడీ కృషి చేస్తోందని సదాశివరావు తెలిపారు.