BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 7:45 am Posted by : Raghunath Rolla

గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం

బాలిక జమున కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించాలి
బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలి : సిపిఐ(యం)
పోలవరం, 03 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల మలేరియా మందులు వికటించి ఒక చిన్నారి మృతి చెందడం, పదుల సంఖ్యలో గిరిజన పిల్లలు అస్వస్థతకు గురికావడం అత్యంత ఆందోళనకరం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్యే. గిరిజన ప్రాంతాల్లో ‘గిరిజన సంజీవని’ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వ డొల్లతనం ఈ ఘటనతో బట్టబయలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు గిరిజనుల రక్షణ గురించి మాట్లాడతారే కానీ, కనీస వైద్య సేవలు అందక గిరిజనులు పిట్టల్లా రాలిపోతుంటే ఏం సమాధానం చెబుతారు?
అసలు గిరిజనులకు ఇచ్చిన క్లోరోక్విన్ మందుల బ్యాచ్ ఎక్స్‌పైరీ తేదీ 2028 అని అధికారులు చెబుతున్నప్పటికీ, ఏ పద్ధతిలో పరీక్షలు చేయకుండా గ్రామంలోని 52 మందికి ఒకేసారి ట్యాబ్లెట్లు వేశారు? ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ (Drugs and Cosmetics Act, 1940) నిబంధనలకు విరుద్ధం కాదా? నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వైద్య శిబిరాలు నిర్వహించడం క్రిమినల్ నెగ్లిజెన్స్ (Criminal Negligence – IPC Sec 304A) కిందకు రాదా? దీనికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులు బాధ్యత వహించాలి. మృతి చెందిన బాలిక మడివి జమున మృతదేహానికి అర్ధరాత్రి పూట హడావుడిగా పోస్ట్‌మార్టం ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో మినహా సూర్యాస్తమయం తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించడానికి వీళ్లేదు. ప్రభుత్వు వైద్యులు ఎవరి ఒత్తిళ్లతో ఈ నిబంధనలను ఉల్లంఘించారు? వాస్తవాలను, మృతికి అసలు కారణాలను కప్పిపుచ్చడానికి రాత్రికి రాత్రే పోస్ట్‌మార్టం పూర్తిచేసి ఏం దాచాలని చూస్తున్నారు?
బాధితులను, మృతి చెందిన జమున కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న సిపిఐ(యం) నాయకులను పోలీసులను అడ్డంపెట్టి అడ్డుకోవడం ఏ రాజ్యాంగం ప్రకారం సమంజసం? రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను, కనీస మానవ హక్కులను కాలరాస్తూ గొల్లగుప్ప గ్రామంలోకి ఎవరినీ వెళ్లకుండా నిర్బంధకాండ ప్రయోగించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నది. గిరిజన ప్రాంతాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి, రోడ్లు వేస్తాం, కరెంట్ ఇస్తామని ఫోటోలకు పోజులిచ్చి ఆదివాసీలను మోసం చేయడమేనా మీ అభివృద్ధి? అసలు ఈ ‘సంజీవని’ కార్యక్రమాలు ఎవరికి ఉపయోగకరంగా ఉన్నాయి? కార్పొరేట్ శక్తులకూ, అధికారుల ప్రచార ఆర్భాటాలకా లేక రోగాలతో మగ్గుతున్న గిరిజనుల ప్రాణాలు కాపాడటానికా? సమాధానం చెప్పాలి. మృతి చెందిన బాలిక మడివి జమున కుటుంబానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనీ, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి గూడేనికి అత్యవసర వైద్య సేవలు అందేలా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, ప్రతి ఒక్కరికీ సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సిపిఐ(యం) డిమాండ్ చేసింది.