BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 9:05 pm Posted by : Raghunath Rolla

అమూల్య నర్సింగ్‌ హోమ్‌పై సీఎంవో చర్యలు

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎల్‌ఓసీల్లో అక్రమాల ఆరోపణలు.. బ్లాక్‌లిస్ట్‌లో ఆసుపత్రి

నరసరావుపేట, 08 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న అమూల్య నర్సింగ్‌ హోమ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సీఎంవో కీలక చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎఫ్‌) ఎల్‌ఓసీలకు సంబంధించిన వ్యవహారాల్లో అక్రమాలు, తప్పుడు బిల్లులు సమర్పించారనే ఆరోపణలపై నిర్వహించిన విచారణ అనంతరం ఆసుపత్రిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు సమాచారం. మెడికల్‌ హెల్త్‌ బోర్డు నిర్వహించిన విచారణలో ఆసుపత్రిలో చికిత్స పొందకపోయినా చికిత్స జరిగినట్లు చూపిస్తూ పెద్ద సంఖ్యలో బిల్లులు రూపొందించినట్లు, ఇప్పటికే జరిగిన చికిత్సలకు సంబంధించిన పత్రాలను ఆధారంగా చూపించి బిల్లుల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయం అందించే విధానంలో భాగంగా ఎమ్మెల్యేలు రిక్వెస్ట్‌ లెటర్లు సమర్పిస్తే, సీఎంవో పరిశీలించి ఎల్‌ఓసీ మంజూరు చేస్తుంది. అయితే అమూల్య నర్సింగ్‌ హోమ్‌కు సంబంధించిన ఎల్‌ఓసీలు, బిల్లుల వ్యవహారంలో అవకతవకలకు సంబంధించిన ఆధారాలు లభించడంతో సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్‌ఓసీలతో పాటు సంబంధిత సేవలను నిలిపివేసినట్లు సమాచారం.. ఈ వ్యవహారంలో చంద్ర ఖాసీంతో పాటు మరో వ్యక్తి పాత్రపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. వీరిపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరింత మంది ప్రమేయం ఉందా అనే కోణంలోనూ సీఎంవో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.