BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 2:51 pm Posted by : Raghunath Rolla

విలీన గ్రామాల్లో పెండింగ్ పనులు పై సమగ్ర నివేదిక ఇవ్వాలి

జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు, 02 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామాల్లో పెండింగ్ అభివృద్ది పనులు, మౌళిక వసతుల కల్పనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం చౌడవరం, జూనం చుండూరు, పొత్తూరు తదితర ప్రాంతాల్లోపర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర శివారు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్లు, శ్మశానవాటికలపై వార్డ్ ల వారీగా సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. అదేవిదంగా సదరు నివేదికలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ది పనులు, బిల్లుల చెల్లింపు, పెండింగ్ పనుల వివరాలు కూడా అందించాలన్నారు. జూనం చుండూరులో శ్మశానవాటికలో అపరకర్మలకు గది నిర్మాణం, అదే ప్రాంతంలో రోడ్ నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని, జాతీయ రహదారి నుండి రావడానికి ఇబ్బంది లేకుండా వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఏఈని ఆదేశించారు. వీధి కుక్కలకు ఏబీసి చేయడం, ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్ ని ఆదేశించారు. పొత్తూరులో శ్మశానవాటిక ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, స్థలాన్ని జిఎంసికి అప్పగించడంపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. జిందాల్ ప్లాంట్ ఎదుట బయోగ్యాస్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, ప్లాంట్ ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్ఈ సుందర్రామిరెడ్డి, సిటి ప్లానర్ రాంబాబు, డిఈఈ సతీష్, ఎస్ఎస్ వెంకటప్పయ్య, సర్వేయర్ సుభాని, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.