BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 11:39 pm Posted by : Yaddanapudi Arudra

వినాయక చవితి ఉత్సవాలను ఈకో ఫ్రెండ్లీగా నిర్వహించాలి : జి.ఎం.సి కమిషనర్

గుంటూరు, సెప్టెంబర్ 03. భారత్ ప్రతినిధి న్యూస్.

ఈ నెల 14న నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలను ఎకో ఫ్రెండ్లీ గా నిర్వహించుటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు.    గురువారం నగర పాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ నందు వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా నిర్వహించడానికి నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ మరియు పబ్లిక్ హెల్త్ విభాగ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో వినాయక చవితి పండుగ ఉత్సవాలను ఎకో ఫ్రెండ్లీగా నిర్వహించుకోవాలని, ప్రజలు అందరు మట్టి గణపతి ప్రతిమలనే వాడేలా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. దీని కోసం రానున్న శనివారం నగర పాలక సంస్థలో పాఠశాలల ప్రతినిదులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు అవగాహన కలిగించాలన్నారు. నగరంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించు వారు తప్పనిసరిగా పోలీస్, రెవిన్యూ మరియు అగ్నిమాపక శాఖల వారి అనుమతులు తీసుకోవాలని, విగ్రహాలను రోడ్ల పై యధేచ్చగా పెట్టకుండా చూడాలన్నారు. ముఖ్యంగా వాహన దారులకు, ట్రాఫిక్ నకు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చూడాలన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో పారిశుధ్య పరమైన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సదరు ప్రాంతాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాక విగ్రహాలు ఏర్పాటు చేయడానికి వేసే టెంట్ల కోసం నూతనంగా వేసిన రోడ్లను ప్రజలు తవ్వుతున్నారని, రోడ్లకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా టెంట్లను ఏర్పాటు చేసుకొనేలా ఉత్సవ కమిటీ ప్రతినిధులకు తెలియచేయలన్నారు. అదేవిదంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనల మేరకు పండుగ అనంతరం విగ్రహాలను ఎక్కడపడితే అక్కడ నిమజ్జనం చేయకుండా, ప్రత్యేకంగా నగరంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో కృత్రిమ చెరువులను ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాలను ఎటువంటి సమస్యలు లేకుండా నిర్వహించడానికి అన్ని విభాగాల అధికారులు కలిసి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, యస్.ఈ సుందర్రామి రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.