గుంటూరు, 04 సెప్టెంబర్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అర్హులైన వారందరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. పెన్షన్ మంజూరులో అర్హతే ప్రామాణికమని రాజకీయాలకు తావు లేదని ఎమ్మెల్యే తెలిపారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని సానుకూలంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రజా గ్రీవెన్స్లో కొత్త పింఛన్ల కోసం పెద్ద సంఖ్యలో అర్జీలు అందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో అర్హులైన వారందరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పేద, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచే ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హుల పేరుతో నిజమైన లబ్ధిదారులను పింఛన్ల జాబితా నుంచి తొలగించి, అధికార పార్టీకి చెందిన వారికి ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించారని ఎమ్మెల్యే విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయ పక్షపాతం చోటుచేసుకోవడం వల్ల ఎంతో మంది అర్హులు నష్టపోయారని అన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో మాత్రం సంక్షేమ పథకాల అమలులో “అర్హతే ప్రామాణికం” అని గళ్ళా మాధవి స్పష్టం చేశారు. పింఛన్ల మంజూరులో ఎటువంటి రాజకీయ జోక్యాలకు తావు ఉండదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి పారదర్శకతతో పింఛన్లు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ఒక్క లబ్ధిదారుడూ నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.