రాజమండ్రి బ్యూరో, 31 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అనపర్తి నియోజకవర్గం చండ్రేడు గ్రామంలో ఆదివారం ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీ యువత ఐక్యత మహాసమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి గ్రామ యువత భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్య అతిథులుగా ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉందిర్తి. సుబ్బారావు, జై భీమ్ ఫాలోవర్స్ రాష్ట్ర అధ్యక్షులు కొంగు. సందీప్ రాజ్ హాజరయ్యారు. అతిథులుగా అనపర్తి నియోజకవర్గ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చండ్రేడు గ్రామ నాయకులు మద్దిపూడి. సత్యనారాయణ, జై భీమ్ ఫాలోవర్స్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, చండ్రేడు ఎస్ సి యూత్ లీడర్ ఒడే జ్యోతి బాబు, గ్రామ నాయకులు కోరిమిల్లి భూదేవి, కోరిమిల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉందిర్తి సుబ్బారావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మధ్య ఐక్యత లోపించడం వల్లే మన హక్కులు మనకు దక్కడం లేదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న సమసమాజ స్థాపన కోసం యువతే ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


కొంగు సందీప్ రాజ్ మాట్లాడుతూ జై భీమ్ ఫాలోవర్స్ ఎల్లప్పుడూ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతుందని, యువతలో చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి సమావేశాలు ఎంతో అవసరమని తెలిపారు. విద్యతోనే జాతి అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలని సూచించారు. మద్దిపూడి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, అందరూ కలిసికట్టుగా ఉంటేనే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చని అన్నారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు మద్దిపూడి సత్తిబాబు, ఉందుర్తి సుబ్బారావు, కొంగు సందీప్ రాజ్, లక్ష్మణ్, జ్యోతి బాబు, జగదీష్ లను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ మహాసమావేశాన్ని రాజేష్, సత్తిబాబు, అంజి, లక్ష్మణ్, జాషువా లు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు.