గుంటుపల్లి, 24 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గుంటుపల్లి సెంటర్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య దుర్మరణం చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. గుంటుపల్లి ఖాజీపేట అంజని గ్రీన్ పార్క్లో నందం బాలగంగాధరరావు కుటుంబం నివసిస్తోంది. సోమవారం బాలగంగాధరరావు (61) తన భార్య నిర్మల జ్యోతి (56)తో కలిసి ద్విచక్ర వాహనంపై వన్టౌన్లోని వారి బంగారు నగల దుకాణానికి పనికి బయలుదేరారు. కొద్ది నిమిషాల్లోనే గుంటుపల్లి సెంటర్లో వారి ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నిర్మల జ్యోతి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో ఆమె తల భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. బాలగంగాధరరావు కూడా తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిర్మల జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గుంటుపల్లి సెక్టార్ ఎస్సై సత్యవతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.