BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 6:37 pm Posted by : BHARATH PRATHINIDHI

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

చిలకలూరిపేటలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం

పలు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమలు మరియు నిత్యవసర సరుకులు, బియ్యం కూరగాయలు, పంపిణీ

చిలకలూరిపేట, 17 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని చిలకలూరిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ చిలకలూరిపేట డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో అమలవుతున్న వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ (WJHS)లో నెట్‌వర్క్ ఆస్పత్రుల వద్ద ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయనే కారణంతో కొన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో WJHS కార్డులను అనుమతించకపోవడం, కొన్ని వైద్య ప్రక్రియలకు కార్డు వర్తించకపోవడం వల్ల జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ లోటుపాట్లను సరిచేసి పథకాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని కోరారు. WJHS అమలులో రోజువారీగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు సమాచార శాఖ, ఎన్టీఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు పావులూరి బ్రహ్మానందం, బాలు, సభ్యులు గిరి, వెంకట్రావు, శ్రీను, మస్తాన్‌రావు, మనోజ్, మధు, నారాయణస్వామి, రమేష్, నాగచౌదరి, విజయ్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లా బక్షు, మురళి, సత్యం, కిషోర్, వాసు, ప్రసాదు, ప్రసన్న, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాపూజీ, ప్రశాంతి వృద్ధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని మరియు నిత్యవసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు.