BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 2:44 am Posted by : Raghunath Rolla

పేదరిక నిర్మూలనకు పీ-4 కార్యక్రమం గొప్ప సామాజిక ఉద్యమం

సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివేదిక

గుంటూరు, 28 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పేదరిక నిర్మూలనకు పీ-4 కార్యక్రమం గొప్ప సామాజిక ఉద్యమమని, ఈ కార్యక్రమం ద్వారా గుంటూరు పశ్చిమలో 19 వేల బంగారు కుటుంబాలను గుర్తించి, ఇప్పటికే 11,800 కుటుంబాలకు మార్గదర్శకుల అనుసంధానం చేసినట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన విజన్ యాక్షన్ యూనిట్స్ & పీ-4 అంశం పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన పీ-4 కార్యక్రమం ఒక గొప్ప నైతిక, సామాజిక ఉద్యమమని, పేదరిక నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ఈ కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 19 వేల బంగారు కుటుంబాలను గుర్తించామని, అందులో ఇప్పటికే 11 వేల నుండి 11,800 కుటుంబాలకు 147 మంది మార్గదర్శకులను అనుసంధానం చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మిగిలిన సుమారు 7 వేల కుటుంబాలకు కూడా వచ్చే ఏడాది కాలంలో మార్గదర్శకులను అనుసంధానం చేసి, పీ-4 కార్యక్రమ పరిధిలోకి తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
కుటుంబాలను పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావడంలో ఆరోగ్యం, ఉపాధి, గృహ నిర్మాణం అనే మూడు అంశాలు అత్యంత కీలకమని గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో పలు ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకుని అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఉపాధి కల్పనలో భాగంగా వివిధ సంస్థలు, పరిశ్రమలు, వ్యక్తిగత దాతల సహకారంతో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా, విద్యార్థులకు ఫీజుల సహాయం, స్వయం ఉపాధి కోసం రుణాలు, పుష్ కార్టులు, చిన్న వ్యాపారాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. అయితే సామాన్య కుటుంబాలపై అత్యధిక ఆర్థిక భారం కలిగించే అంశం సొంత ఇల్లు అని పేర్కొన్న ఎమ్మెల్యే, గృహ వసతి సమస్యకు ప్రభుత్వం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తే ఒక కుటుంబం పూర్తిగా పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రికి తెలిపారు. సీఎం అందిస్తున్న మార్గదర్శకత్వం, సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పీ-4 కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి బంగారు కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలియజేశారు.