BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 8:23 pm Posted by : BHARATH PRATHINIDHI

ఆగస్టు 17 నుండి సింగల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పూర్తిస్థాయిలో అమలు

గుంటూరు, 14 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆగష్టు 17 నుండి గుంటూరు నగరంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని నగర పాలక సంస్థ సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ స్పష్టం చేశారు. నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేదం ఉన్నందున ఆగస్ట్ 17 ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ప్లాస్టిక్ వలన కలిగే అనర్ధాలను ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని గురించి నగరంలోని వ్యాపారస్తులకు తెలియచేయాలన్నారు. ఆగష్టు 17 నుండి ఎవరైనా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడినట్లైతే వారికి అపరాధ రుసుము విధించాలన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఖాళీ స్థలాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో ఎంఎల్ఓ ఆయిల్, ఎబైల్ లను స్ప్రే చేయించాలని బయాలజిస్ట్ ని ఆదేశించారు. ముఖ్యంగా నగరంలోని ఖాళీ స్థలాల యజమానులను గుర్తించి, వారి స్థలాలను శుభ్రం చేయించుకోనేలా అవగాహన కలిగించాలన్నారు. నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడానికి పూర్తి స్థాయిలో వాహనాలు, కార్మికులను కేటాయించామన్నారు. నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, సైడు కాలువలను ప్రతి రోజు శుభ్రం చేయించి, డ్రైన్లలో తొలగించిన వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. ముఖ్యంగా గార్బేజ్ పాయింట్లు లేకుండా చూడాలని, రోడ్ల పై గార్బేజ్ పాయింట్లు ఉన్నట్లయితే వెంటనే వాటిని తొలగించాలని యస్.ఐ లను ఆదేశించారు. పారిశుధ్యానికి సంబంధించి ప్రజల దగ్గర నుండి ఏమైనా పిర్యాదులు అందినట్లైతే, సదరు పిర్యాదులను వెంటనే పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల హాజరు తప్పనిసరిగా ఎఫ్ఆర్ఎస్ ద్వారానే తీసుకోవాలని, దాని ప్రకారమే జీతాలు చేస్తారన్నారు. బల్క్ వేస్ట్ జనరేటర్స్ ని గుర్తించి, వివరాలను ఆన్ లైన్ చేయాలన్నారు. డాగ్ ఫీడింగ్ జోన్లపై ప్రజలకు అవగాహన కల్గించి, వాటికి ఆహారం అందించే వారు డాగ్ ఫీడింగ్ జోన్లలోనే కుక్కలకు ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ప్రధాన రహదారుల్లో ప్రజలు వారి ఆవులను యధేచ్చగా వదిలేస్తున్నారని, వాటి వలన నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువౌతున్నాయని, వాటిని పట్టుకొని నగర పాలక సంస్థ బందెల దొడ్డికి తరలించాలన్నారు. ఈ సమావేశంలో ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, బయాలజిస్ట్ శేషయ్య, వెటర్నరీ డాక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.