BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 2:52 am Posted by : BHARATH PRATHINIDHI

గుంటూరు నగరంలో ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ నిషేధం

కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, 17 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలో ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుంటూరు నగరపాలక సంస్థ 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై సోమవారం (17వతేదీ) నుండి పూర్తి స్థాయి నిషేధాన్ని అమలు చేసింది. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, వీధి వ్యాపారులు మరియు ప్రజలు నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించినా, విక్రయించినా జరిమానాలు మరియు చట్టపరమైన చర్యలు తప్పవని నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణదారులకు రెండు విడతలు అపరాధ రుసుం విధించినప్పటికీ మార్పు లేకపోతే, ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు దుకాణాలను సీజ్ చేస్తాం అన్నారు. వార్డు స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు హోల్‌సేల్, రిటైల్ దుకాణాలు, గోదాములలో ప్రతిరోజూ తనిఖీలు చేపడతాయి. ప్లాస్టిక్ సంచులకు బదులుగా పర్యావరణహితమైన గుడ్డ లేదా కాగితపు సంచులను మాత్రమే వినియోగించి నగర పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. నగరంలో ఎక్కడైనా 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన కవర్లు లేదా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు/వినియోగం కనిపిస్తే వెంటనే జి‌ఎం‌సి కాల్ సెంటర్ 0863-2345103 కు సమాచారం అందించాలని తెలిపారు.