BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 2:56 am Posted by : Raghunath Rolla

తెనాలిలో ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం

గుంటూరు, 28 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు స్థానిక శాసన సభ్యులు నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ నేతృత్వంలో తెనాలిలో మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు స్థానిక శాసన సభ్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చిందన్నారు. సమస్యలు లేని సమాజాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి ఆశయం అన్నారు.

జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ, ప్రజల నుండి స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన, సంతృప్తికరమైన పరిష్కారం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం సంకల్పించిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయుటకు, వాటి పట్ల అవగాహన కల్పించుటకు ఇది ఒక మంచి వేదిక అన్నారు. ప్రజల ముంగిటకే ప్రభుత్వం వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించుటకు అవకాశం కలుగుతుందన్నారు. నియోజక వర్గం స్థాయిలోనే నెలకు నాలుగు సార్లు అధికారులు సందర్శించడం వలన ప్రజలు స్థానికంగానే అర్జీల పరిష్కారం వివరాలు సైతం తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రజల అర్జీలకు వారి సమక్షంలోనే నాణ్యమైన పరిష్కారం కూడా లభిస్తుందన్నారు. ఇప్పటికే ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించడమే కాకుండా సంబంధిత శాఖల అధికారులు నేరుగా అర్జీదారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. తెనాలిలో రవాణా శాఖకు స్థలం కేటాయించాలని ప్రాంతీయ రవాణా అధికారి కె.శ్రీహరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిని నాదెండ్ల మనోహర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ రవాణా అధికారి సమర్పించిన ప్రతిపాదనలను తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారికి అందజేస్తూ తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. లభ్యంగా ఉన్న ప్రభుత్వ భవనాలు గుర్తించాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరమణి, ఆర్.టి.ఓ కె శ్రీహరి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జె పార్థసారథి, జిల్లా వ్యవసాయ అధికారి  ఎం. పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి బి.వి.రంగా రావు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ లు సి.హెచ్.రమేష్, జిల్లా విద్యా శాఖ అధికారి డా.షేక్ సలీం భాషా, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు పి.సత్యనారాయణ, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పల నాయుడు, తెనాలి తహసిల్దార్ గోపాల కృష్ణ, తెనాలి నియోజకవర్గ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.