ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి
కాకినాడ బ్యూరో, 25 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : పిఠాపురం అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న సాదిక్ ఖాన్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని వైయస్ఆర్సీపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై మీడియాలో వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించారు.రాజకీయంగా తనకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ 2023 ఫిబ్రవరి 14వ తేదీన సాధిక్ ఖాన్ రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసుకుని తనను కోరడంతో ప్రారంభోత్సవానికి వెళ్లానన్నారు. ఆ సమయంలో తనకు స్వాగతం పలికి శాలువా కప్పిన ఫోటోలను చూపిస్తూ కొన్ని మీడియా సంస్థలలో సాదిక్ ఖాన్ తో తనకు సంబంధం ఉందన్న రీతిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు మళ్లీ సాధిక్ ఖాన్ తనను కలవలేదని ద్వారంపూడి స్పష్టం చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రస్తుతం కాకినాడ సిటీ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ గా ఉన్న తన ప్రతిష్టను దెబ్బతీయాలని దురుద్దేశంతోనే పథకం ప్రకారం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు మీడియాకు వెన్నతో పెట్టిన విద్యగా ద్వారంపూడి వ్యాఖ్యానించారు. ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని ఆయన మీడియాకు హితవు పలికారు. లేని విషయాన్ని పదేపదే ప్రచారం చేయడం ద్వారా అది వాస్తవం అన్న ధోరణిలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు.