BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 4:02 am Posted by : BHARATH PRATHINIDHI

నిబ్బనుపూడి మురళీధరరావు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం

ఘనంగా శతజయంతి వేడుకలు

నిస్వార్థ సేవాభావం.. న్యాయవాద వృత్తిలో నైతిక విలువలు ఆదర్శం

బాపట్ల, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ న్యాయవాది, రంగస్థల కళాకారుడు, కవి నిబ్బనుపూడి లక్ష్మణ మురళీధరరావు శతజయంతి వేడుకలు బాపట్లలో ఘనంగా నిర్వహించారు. చీలు రోడ్డు సెంటర్‌లోని కోన భవన్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మురళీధరరావు సేవలను, వ్యక్తిత్వాన్ని స్మరించుకున్నారు.

మాజీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ మురళీధరరావు నిస్వార్థ సేవాభావం, పేదల పక్షాన నిలిచే ధైర్యం, వృత్తిపట్ల చూపిన నిబద్ధత నేటి తరానికి ఆదర్శమన్నారు. బాపట్లకు ఉన్న ప్రత్యేకతను, న్యాయవాదుల సేవా వారసత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాపట్ల అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు, రిటైర్డ్ లెక్చరర్ ఇన్ పాలిటిక్స్ జి. శాంతారాం మాట్లాడుతూ మురళీధరరావు అన్యాయానికి గురైన వారికి అండగా నిలిచిన గొప్ప మానవతావాది, ధైర్యవంతుడైన న్యాయవాది అని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు.

బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు విన్నకోట సత్యప్రసాద్ మాట్లాడుతూ మురళీధరరావు న్యాయవాద వృత్తిలో ఉన్నత నైతిక విలువలకు ప్రతీకగా నిలిచారని అన్నారు. సివిల్, క్రిమినల్ న్యాయశాస్త్రాల్లో సమాన పరిజ్ఞానంతో రాణించిన అరుదైన న్యాయవాదిగా ఆయనను స్మరించారు. యువ న్యాయవాదులను ప్రోత్సహించడంలో ఆయనకు విశాల హృదయం ఉండేదన్నారు.

ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు శాంతకుమార్ మాట్లాడుతూ మురళీధరరావు నిబద్ధత, వ్యక్తిత్వం, క్రమశిక్షణ నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. విలువలు క్షీణిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన జీవితం, న్యాయవాద వృత్తిలో పాటించిన నైతిక విలువలు యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయనను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం
ముందుగా మన్నే శ్రీనివాసరావు, కోన రఘుపతి, పువ్వాడ ఏకమేశ్వరరావు, మురళీధరరావు కుమారులు లక్ష్మీనరసింహారావు, శ్రీహరి ప్రకాష్, సాయి కృష్ణ, అజయ్ కుమార్ తదితర కుటుంబ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సాహితీవేత్తలు, కళాకారులు, కుటుంబ సభ్యులు, సీనియర్ సిటిజన్లు, మిత్రులు పాల్గొని నిబ్బనుపూడి లక్ష్మణ మురళీధరరావుకు ఘన నివాళులర్పించారు. ఆయన సేవలు, విలువలు, బహుముఖ ప్రజ్ఞను కొనియాడుతూ శతజయంతి సందర్భంగా స్మరించుకున్నారు.