బాక్సాఫీస్ వద్ద చిరంజీవి – రజనీకాంత్ మధ్య ‘డబుల్ క్లాష్’!
భారతీయ సినీ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద రెండుసార్లు ముఖాముఖి తలపడేందుకు సిద్ధమవుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 15న రజనీకాంత్ ‘జైలర్ 2’ విడుదలవుతుండగా, మరుసటి రోజే (అక్టోబర్ 16న) చిరంజీవి ‘విశ్వంభర’ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమరం ముగిసిన వెంటనే, సంక్రాంతి పండుగ బరిలోనూ చిరంజీవి-బాబీ చిత్రం ‘కదిరి నరసింహుడు’, రజనీకాంత్-కమల్ హాసన్ కాంబో చిత్రం ‘ధర్మన్’ ఢీకొననున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘జైలర్’, ‘భోళాశంకర్’ ఒక్క రోజు తేడాతో విడుదలవ్వగా, ఇప్పుడు ఏకంగా రెండు పండుగలకు వీరిద్దరి మధ్య ‘డబుల్ క్లాష్’ ఖరారవ్వడం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.
దసరా బరిలో ‘జైలర్ 2’ vs ‘ విశ్వంభర ’
రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కిస్తున్న భారీ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న థియేటర్లలోకి రావడానికి ముస్తాబవుతోంది. దీనికి సరిగ్గా ఒక్క రోజు వ్యవధిలోనే, అంటే అక్టోబర్ 16న మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ దృశ్యకావ్యం ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్, భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతో థియేటర్లలో దిగుతుండటంతో సినీ ప్రియుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అయితే ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతంలో చిరంజీవి, రజనీకాంత్ చిత్రాలు ఒకే రోజున విడుదలైన దాఖలాలు లేనప్పటికీ, సరిగ్గా ఒక్క రోజు తేడాతో 2023 ఆగస్టులో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అప్పట్లో ఆగస్టు 10న విడుదలైన రజనీ ‘జైలర్’ ప్రభంజనం సృష్టించగా, ఆగస్టు 11న వచ్చిన చిరు ‘భోళా శంకర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దీంతో ఈసారి ‘జైలర్ 2’ను ఢీకొట్టేందుకు చిరంజీవి ‘విశ్వంభర’తో ఎలా బదులిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు మహారథులు బాక్సాఫీస్ బరిలో ‘డబుల్ క్లాష్’కు దిగుతుండటంతో అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్తో పాటు యావత్ భారతీయ సినీ ప్రేమికుల చూపు ఇప్పుడు వీరి సినిమాలపైనే ఉంది.