BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 3:46 pm Posted by : BHARATH PRATHINIDHI

గణేష్ ఉత్సవాలను విజయవంతం చేద్దాం

ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర సమావేశంలో తీర్మానం

గుంటూరు, 24 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరులోని మలినేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. సమితి గౌరవ అధ్యక్షులు గోకరాజు గంగరాజు మరియు అధ్యక్షులు చలసాని ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గణేశ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి, పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచారక్ విజయ ఆదిత్య, సమితి కార్యదర్శి త్రినాథ్, లక్ష్మీపతి, గుంటూరు జిల్లా అధ్యక్షులు మల్లినేని పరమేశ్వరరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, గుంటూరు నగర అధ్యక్షులు పుణుగుళ్ల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. 2025 సంవత్సరంలో గణేశ విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించిన మండపాల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు, అవసరమైన సదుపాయాలు కల్పించడం, అవసరమైన వారికి ఉచిత విద్యుత్ సౌకర్యం అందించడం వంటి చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మరియు సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలిపింది. 2026లో గణేశ ఉత్సవాలను మరింత విజయవంతంగా, ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సమావేశం తీర్మానించింది. జిల్లాల వారీగా ముందస్తు సమన్వయ సమావేశాలు నిర్వహించాలి. నోడల్ అధికారులను నియమించాలి. సింగిల్ విండోలో మండపాల నమోదు ముందుగానే ప్రారంభించాలి. ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలి. పారిశుద్ధ్యం, మంచినీరు, భద్రతకు ప్రాధాన్యం. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, మంచినీటి సదుపాయం, విద్యుత్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ తదితర ఏర్పాట్లు. నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు. క్రేన్లు, గజ ఈతగాళ్లు/శిక్షణ పొందిన సిబ్బంది, లైటింగ్, సౌండ్ సిస్టమ్, భద్రతా ఏర్పాట్లు. పవిత్ర భావంతో నిమజ్జనం మొదలైన విషయాలపై విస్తృతంగా చర్చించారు. వీటి కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సమావేశం తీర్మానించింది. గణేశ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా, పర్యావరణం మరియు ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం, అధికారులు, ఉత్సవ నిర్వాహకులు మరియు భక్తులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ గణేశ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది.