కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్
పెమ్మసాని కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాలు
గుంటూరు, 16 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : స్వాతంత్ర్య సమరయోధుడు, రైతాంగ నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతిని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తమ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసిన ఆయన నివాళులు అర్పించారు.
డా. పెమ్మసాని మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడటంతో పాటు రైతుల హక్కులు, సామాన్య ప్రజల గౌరవం కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న అని స్మరించుకున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, క్విట్ ఇండియా ఉద్యమం సహా అనేక పోరాటాల్లో జైలు జీవితం అనుభవించినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా రైతుల సమస్యలను తన సమస్యలుగా భావించి, రైతాంగ హక్కుల కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. దేశం పట్ల ఆయనకున్న అంకితభావం, ప్రజల కోసం నిలబడిన తీరు, రైతుల హక్కుల కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని డా. పెమ్మసాని పేర్కొన్నారు. అధికారం కంటే ప్రజాసేవకే ప్రాధాన్యతనిస్తూ జీవితాంతం ప్రజల కోసం పోరాడిన సర్దార్ గౌతు లచ్చన్న గారి పోరాట స్ఫూర్తి, నిబద్ధత, దేశసేవను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లచ్చన్న గారి పోరాటం చరిత్రలో ఒక అధ్యాయం కాదు.. బీసీల భవిష్యత్తుకు ఒక దిక్సూచి. ఆయన ఆశయాలను కాపాడుకోవడం, బీసీల సంక్షేమం కోసం నిరంతరం పనిచేయడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి” అని వేములకొండ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా టిడిపి బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, తాళ్ళ వెంకటేష్ యాదవ్, నిమ్మల శేషయ్య, తాడికొండ నరసింహరావు, గాలి సుబ్బారావు, ఉప్పుటూరి పేరయ్య, గట్టి శ్రీనివాసరావు, జంపని నాగేశ్వరరావు, రావుల మణి, రాచకొండ లక్ష్మయ్య, దేవళ్ళ వెంకట్, గుమ్మా బాలు, జల్లెడ గవాస్కర్ తదితర టీడీపీ బీసీ విభాగం నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొని “గౌతు లచ్చన్న అమర్ రహే” అంటూ ఘనంగా నివాళులర్పించారు.