BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 2:18 pm Posted by : BHARATH PRATHINIDHI

‘ధాయి ఆఖర్’ లేఖా రచన పోటీ

విద్యార్థుల్లో లేఖా రచనపై ఆసక్తిని పెంపొందించేందుకు భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లేఖా రచన పోటీ

గుంటూరు, 20 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : విద్యార్థులు మరియు యువతలో లేఖా రచన పట్ల ఆసక్తిని పెంపొందించడం, భావాలను సృజనాత్మకంగా వ్యక్తపరిచే అలవాటును ప్రోత్సహించడం, ఉత్తరాల ద్వారా మానవ సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన “ధాయి ఆఖర్” లేఖా రచన పోటీ నిర్వహించబడుతోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఈ-మెయిల్ వంటి ఆధునిక సమాచార సాధనాల వినియోగం పెరిగిన నేపథ్యంలో, చేతిరాత ఉత్తరాల ప్రాధాన్యతను. వాటిలోని ఆత్మీయతను యువతకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యం తపాలా శాఖ ఈ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీలో విద్యార్ధులు మరియు యువతలో ఆసక్తి ఉన్న వారు ‘A Letter to Mother Earth : My Promise to Protect Nature’ అంశంపై తమ ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభవాలను లేఖ రూపంలో వ్యక్తపరచవచ్చు. మంచి భాషా పరిజ్ఞానం, సృజనాత్మకత, భావవ్యక్తీకరణ, లేఖా రచనా విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తమమైన లేఖలను ఎంపిక చేస్తారు. “థాయి ఆఖర్” లేఖా రచన పోటీ ద్వారా లేఖ రాయడం ఒక కళ మాత్రమే కాకుండా, మన భావాలను హృదయపూర్వకంగా ఇతరులకు చేరవేసే అందమైన మాధ్యమం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతోంది. గుంటూరు డివిజన్ పరిధిలోని విద్యార్ధులు మరియు యువత ఈ పోటీలో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని గుంటూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ యు.యలమందయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పోటీకి సంబంధించిన అంశం, అర్హతలు, లేఖ పరిమాణం, వయస్సు విభాగాలు, చివరి తేదీ (31 అక్టోబర్ 2026), బహుమతులు మరియు ఇతర నిబంధనలు తపాలా శాఖ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు సమీప తపాలా కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 31 అక్టోబర్ 2026 తర్వాత పోస్ట్ చేసే లేఖలు స్వీకరించబడవు, లేఖలను పోస్ట్ ఆఫీసు ద్వారా పంపాలని, మరిన్ని వివరాలకు www.indiapost.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు అని గుంటూరు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ యు.యలమందయ్య తెలిపారు.