గుంటూరు, 18 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సమస్యల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన రోజురోజుకీ ఉదృతం అవుతోంది. ఇప్పటికే ఎమర్జెన్సీ విధులను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం గుంటూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన సాగింది. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణాతో సమానంగా స్టైఫండ్ ఇవ్వడం సాధ్యం కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటన చేయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ జీవన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని స్టైఫండ్ పెంచాలని కోరారు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయని పక్షంలో ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.