BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 3:49 pm Posted by : BHARATH PRATHINIDHI

23 నుంచి పారదర్శకంగా ఏఈఈల నియామక పరీక్షలు

ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి

గుంటూరు, 21 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి 27 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి తెలిపారు. పరీక్షలను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఫేస్ వెరిఫికేషన్, మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్తకాలు, కాగితాలు అనుమతించబోమన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ దళారులు చేసే ప్రచారాన్ని నమ్మొద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సీఎండీ సూచించారు.