BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 2:53 pm Posted by : BHARATH PRATHINIDHI

పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల చెక్కు అందజేసిన కేసీఆర్

వరంగల్, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కార్యక్రమాన్ని ఆదివారం వరంగల్‌ జిల్లాలోని నల్లబెల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గులాబీ బాస్ నల్లబెల్లి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల చెక్కును కేసీఆర్ అందజేశారు. ఆయన ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున అందజేయనున్నారు. అలాగే, పెద్ది సుదర్శన్ రెడ్డి అమ్మ అమృతమ్మ సంక్షేమం కోసం రూ.25 లక్షలు బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. పిల్లల బాగోగులు, చదువలు, కుటుంబ సంక్షేమాన్ని తాము ఎల్లవేళలా పర్యవేక్షిస్తామని కేసీఆర్ మాటిచ్చారు. వారికి పార్టీ, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం నల్లబెల్లి నుంచి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు.