అటవీశాఖ అధికారులు హెచ్చరిక
బొబ్బిలి, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామ చెరువులో అడవి ఏనుగుల గుంపు తిష్టవేసింది. ఈ మేరకు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. తెల్లని దుస్తులు ధరిస్తే గజరాజులకు కనిపించకుండా ఉండాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని సూచించారు. వాటిని గ్రామాల నుంచి దూరంగా తరిమేందుకు శిక్షణ పొందిన కుంకి ఏనుగులను రంగంలోకి దించినట్లు డీఎఫ్వో ప్రసన్న పేర్కొన్నారు. వాటిని చూడగానే అడవి ఏనుగులు భయంతో పరుగులు తీస్తున్నట్లు గుర్తించామన్నారు. శిక్షణ పొందిన ఏనుగుల సహాయంతో అడవి ఏనుగులను మచ్చిక చేసే పరిస్థితిని కల్పిస్తున్నామని డీఎఫ్వో ప్రసన్న తెలిపారు. ప్రస్తుతం పిరిడి చెరువు పరిసర ప్రాంతాల్లో ఏనుగుల కదలికలను అటవీశాఖ సిబ్బంది నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. గ్రామాల వైపు అవి రాకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. రెండు రోజుల పాటు ఏనుగులు సంచరిస్తున్న పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్వో సూచించారు. ఏనుగులు కనిపించినప్పుడు వాటి వద్దకు వెళ్లడం, ఫొటోలు లేదా వీడియోల కోసం దగ్గరగా వెళ్లడం చేయరాదని హెచ్చరించారు. గుంపుగా వెళ్లి ఏనుగులను తరిమేందుకు ప్రయత్నించకుండా అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని డీఎఫ్వో ప్రసన్న సూచించారు.