BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 7:34 am Posted by : BHARATH PRATHINIDHI

ఘనంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి

గుంటూరు, 07 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :  అగ్ని కుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, బిసి సంఘాల నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణస్వామివర్మ రాష్ట్ర స్థాయి అగ్నికులక్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సమాజ సంస్కర్త అని కొనియాడారు. 1890లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ప్రప్రథమ రాష్ట్రస్థాయి మహాసభను నిర్వహించి, ఆ సామాజిక వర్గీయులను ఒకతాటిపైకి తీసుకొచ్చారన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలోనూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ విశేష సేవలు అందించారన్నారు. 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడని కొనియాడారు. అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన కృషి ఫలితంగానే  అగ్నికుల క్షత్రియులకు అధికారిక గుర్తింపు లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం సమాజానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. భావి తరాలకు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ సేవలు తెలియజేయాలన్న లక్ష్యంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, బిసి సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.