గంజాయి మూలాలపై పోలీసు శాఖ పూర్తిస్థాయిలో దృష్టి
ఇబ్రహీంపట్నం, 23 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గంజాయి సేవిస్తున్న, విక్రయిస్తున్న వారి గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి నగదు బహుమతులు అందజేస్తామని ఇబ్రహీంపట్నం సీఐ ఎ. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్బాబు ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆదివారం ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమంపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గంజాయి సేవిస్తున్నట్లు అనుమానితులు, చెడు ప్రవర్తన కలిగినవారు, ఇతర రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం వచ్చినవారు కలిపి మొత్తం 1,190 మందికి కొంతకాలం క్రితం గంజాయి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇందులో 91 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు.ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు కచ్చితమైన సమాచారం అందిస్తే రూ.1,500, గంజాయి విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే రూ.5 వేల నగదు బహుమతి అందజేస్తామని సీఐ వెల్లడించారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాల కారణంగా కొంతమందిలో మార్పు వచ్చిందన్నారు.గంజాయి సరఫరా మూలాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం వల్ల విక్రయాలు, సేవించే వారి సంఖ్య తగ్గిందని సీఐ పేర్కొన్నారు. గతంలో పరీక్షలు నిర్వహించిన 70 మందికి మూడు నెలల తర్వాత మరోసారి పరీక్షలు చేయగా 23 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. గంజాయి సేవించే వారిలో మార్పు రావడం వల్లే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని వివరించారు.రాబోయే రోజుల్లో ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించే లక్ష్యంతో మరింత కట్టుదిట్టంగా చర్యలు చేపడతామని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు రాజు, రవివర్మ, సత్యవతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.