ఐక్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం: బొప్పరాజు వెంకటేశ్వర్లు
గుంటూరు, 01 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : ఏపీ జేఏసీ అమరావతి సంఘానికి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం శనివారం గుంటూరులోని రెవెన్యూ భవన్లో జరిగింది. సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మెప్మా, సెర్ఫ్ శాఖల తరహాలో హెచ్ఆర్ పాలసీని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస టైమ్స్కేల్, సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేసి అందులో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం కల్పించాలని, కమిషన్ నివేదిక వచ్చే వరకు మధ్యంతర భృతి ప్రకటించాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అందరూ ఐక్యంగా ఉద్యమిస్తేనే ఫలితాలు సాధ్యమవుతాయని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను గుంటూరు జిల్లా ఏపీ జేఏసీ అమరావతి కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గంటా సంపత్కుమార్, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కేశవ, గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్ కిరణ్కుమార్, జిల్లా అధ్యక్షుడు నూకబత్తిన నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల అశోక్, జిల్లా కోశాధికారి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరు శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.