కాకినాడ బ్యూరో, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : 22-ఏ. నిషేధిత జాబితాలో పొరపాటున చేర్చబడినట్లు భావించే భూయజమానులు ప్రైవేట్ పట్టా భూములను సవరించుకునేందుకు బాధితులు తమ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రెవెన్యూ (రిజిస్ట్రేషన్) శాఖ జారీ చేసిన జి. వో ఎమ్ .ఎస్.నెంబర్ 444 (తేదీ: 27.07.2026) ప్రకారం 22-ఎ. భూముల పరిష్కారానికి ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసిందని, కావున ప్రైవేట్ పట్టా భూములు పొరపాటున ఈ జాబితాలో చేర్చబడినట్లు భావించే భూ యజమానులు తమ పట్టాదారు పాస్బుక్, రిజిస్టర్డ్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు, కోర్టు ఉత్తర్వులు (ఉన్నట్లయితే), తాజా ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్ మరియు ఇతర ఆధార పత్రాలతో సంబంధిత తహశీల్దారు వారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమర్పించిన దరఖాస్తులను అధికారులు జీవో నెం. 444 మరియు ప్రభుత్వ నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఉన్న కేసుల్లో తదుపరి చర్యలు చేపడతారని, ప్రైవేట్ పట్టా భూ యజమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో మల్లిబాబు కోరారు.