BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 6:56 pm Posted by : BHARATH PRATHINIDHI

“డ్రగ్స్ వద్దు బిడ్డ” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్‌కు క్లాప్ కొట్టిన గుంటూరు ఎస్పీ

గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్యపరిచే లక్ష్యంతో రూపొందిస్తున్న “డ్రగ్స్ వద్దు బిడ్డ” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ చిత్రీకరణను గురువారం తెనాలి గాంధీచౌక్ కూడలిలో ఘనంగా ప్రారంభించారు. సినీ దర్శకుడు దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సందేశాత్మక లఘు చిత్రానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ కెమెరా స్విచ్ ఆన్ చేసి తొలి సన్నివేశాన్ని ప్రారంభించారు. సీనియర్ సినీ నటుడు నరసింహ రాజు పాల్గొన్న సన్నివేశంతో చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం, పోలీసు శాఖ సమన్వయంతో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం, కొనుగోలు, వినియోగం, నిల్వ, రవాణా, సరఫరా వంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ఎనిమిది నెలల్లో డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొన్న సుమారు 450 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిదంగా జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న “సంకల్పం” కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు సుమారు 75 వేల మంది స్టూడెంట్స్ కి డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. డ్రగ్స్ యువత భవిష్యత్తుతో పాటు కుటుంబాలు, సమాజాన్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొన్న ఎస్పీ, ఇప్పటికే పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ ద్వారా మరింత విస్తృతంగా ప్రజలకు ఈ సందేశాన్ని చేరవేస్తున్నామని తెలిపారు. సామాజిక బాధ్యతతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెనాలి ఆర్డీఓ శ్రీరమణి, సహాయ కమిషనర్ రామారావు, తెనాలి సీఐలు సీహెచ్. రాంబాబు, డి. రవీంద్రబాబు, ఎస్. సాంబశివరావు, షేక్ నాయబ్ రసూల్ తదితర అధికారులు పాల్గొన్నారు.